Sep 15, 2008

అంతిమ సంస్కారం


ఏదో పనిలో నేను SR Nagar లో ఉండగా, నా సెల్ ఫోన్ మోగింది. మా వదినచెప్పింది "
అమ్మమ్మ చనిపోయిందని ". నాకేమీ బాధ అనిపించ లేదు. ఎందుకంటే గత రెండు
సంవత్సరాలనుండి ఆమె మంచం పై జీవచ్చవంలా పడి ఉండేది, కళ్ళు తప్ప ఇంకేవి కదపలేని
స్థితిలో.. తాతచనిపోయిన కొద్ది రోజులకే అమ్మమ్మ పరిస్థితి  క్షీణించింది. 80
సంవత్సరాల పైబడి వయసు, నడవలేనిస్థితిలో నేల మీద పాకుతూ రెండు సంవత్సరాలు
గడిపింది, తరవాత అసలు కుర్చోలేని స్థితి.. ఆ తరవాత చేతులు కూడా కదపలేని స్థితి.
ఇద్దరు వ్యక్తులు ఆమెని చూసుకోటానికి ఉండవలసివచ్చేది. ఆడవ్యక్తి కనక ఆడవాళ్లే
అవసరం. అలా అమ్మమ్మ పరిస్థితి  విషమం.అందుకే అమ్మమ్మ చనిపోయిందన్న విషయం
పెద్దగా బాధించలేదు.అలాంటి  స్థితిలో ఎవరు మాత్రం బ్రతకాలనికోరుకుంటారు?? అదృష్టవ
శాత్తు, అమ్మమ్మ చనిపోయే టప్పుడు మా అమ్మ ఆమె  దగ్గరే ఉంది.మా అమ్మ అందరిలోకి
చాలఏమోషనల్. అక్కడే ఉండటం చేత చివరి దశలో తానామే పక్కనే ఉన్నానన్న తృప్తి
మిగులుతుంది.

నేను రూమ్ కివచ్చి బెంగుళూరు లో ఉన్న మా బావకి ఫోన్ చేసాను..రాత్రి 8 గంటల
కల్లా  తాను హైదరాబాద్  వస్తున్నానని చెప్పాడు. అతను  రాగానే ఇద్దరం బయలుదేరాము
అమ్మమ్మ వాళ్ళ ఊరికి ... "వేలూరు" ..హైదరాబాద్ నుండి 60 km దూరంలో ఉన్న
పల్లెటూరు. పక్క town నుండి 10 km. 7 seat auto ల పుణ్యమాని అర్ధరాత్రి కూడా
ప్రయాణం చేయొచ్చు,కనక పెద్దగా ప్రయాస  పడకుండానే ఊరికి వెళ్ళాము.
ఇంటిముందు జంపుఖానా లో ఒకరిద్దరు నిద్రపోతూ ఉన్నారు. ఇల్లంతా నిశబ్దంగా ఉంది. 
'పుట్టిన వానికిమరణము తప్పదు.. మరణించిన వానికి జన్మము తప్పదు.. అనివార్య మగు
ఈ  విషయమై చింతింప తగదు' ... ఘంటసాల గారి భగవద్గీత సన్నగా చెవులని తాకింది. 
చెప్పులు  ఒక మూల వదిలి ఇంట్లోకి వెళ్ళాను.. అమ్మమ్మ చుట్టూ చిన్నమ్మలు,
అత్తయ్య లు కూర్చొని ఉన్నారు.. వాళ కళ్ళన్నీ ఎర్రగా ఉబ్బి ఉన్నాయి..అప్పటివరకు
ఎంతగా ఏడిచారో తెలియజేస్తూ.. నేను మౌనంగా సాష్టాంగ నమస్కారం చేశాను.. ఆమె
ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థించి రెండు నిమిషాల తరవాత లేచాను. మెల్లగా వచ్చి
మా అమ్మ పక్కన కూర్చొన్నాను. నన్ను చూడగానే అమ్మ బావురుమంది, నన్నుపట్టుకొని.
ఏమని ఓదార్చను?? కని ..పెంచి ...ప్రేమానురాగాలు పంచిన మాతృ మూర్తి, .. తల్లి ..
పోతే పడే బాధను ఎవరుమాత్రం ఆపగలరు?? జ్ఞాపకాల వెల్లువ ఉప్పొంగుతుండగా వెక్కి
వెక్కి ఏడ్చింది.. చక్రీ  మా అమ్మరా అంటూ. నేనుమాత్రం అలాగే మౌనగా ఉండి
పోయాను..
 ఆశ్యర్యం.. నా కంట్లో చిన్న కన్నీటి చుక్క కూడా లేదు..ఎడవాలని ప్రయత్నించాను,
కాని ఏడుపు రావటం లేదు.
  అమ్మమ్మ జ్ఞాపకాల కోసం మనసంతా వెతికాను. .. రాలేదు.. ఇదేమిటి నా గుండెలో
అమ్మమ్మకోసం ఒక్క జ్ఞాపకం కూడా లేదా ..కంట్లో ఒక్క బొట్టు నీరైన లేదా??
 ప్రతి ఎండాకాలం సెలవుల్లో మేము అమ్మమ్మ  ఇంటికేవచ్చే వాళ్ళం. అమ్మను మరిపిస్తూ
మాకు అన్నం పెట్టేది, మాట్లాడేది,, కథలు చెప్పి మురిపించేది. ఎన్నెన్నో
తినుబండారాలు చేసి పెట్టేది. వీటిల్లో ఒక్క జ్ఞాపకం కూడా న మనసుకు తట్టటం
లేదు.. బహుశా నా ప్రస్తుత జీవితం నన్నురాయిలా మార్చిందేమో..కొద్ది నిముషాలు
అలాగే కూర్చున్నాను.అందరు మౌనంగా చూస్తున్నారు.. చిన్నమ్మలూ, అత్తయ్యలు..ఇక
అక్కడ కూర్చోలేక బయటికి వచ్చి జంపు ఖానా లో కూర్చొన్నాను.. ఇంతలొ మా మామయ్య
(మేనమామ )వచ్చి  నా ముందు కూర్చొన్నాడు, నేను అతని చేతిలో చేయి వేసి మౌనం
వహించాను.
ఏమని చెప్పను? ఈఓదార్పు మాటలు దుఖాన్ని ఎక్కువ చేస్తాయి కాని తగ్గించవని నా
అభిప్రాయం. అందుకే అలా మౌనంగాఉండిపోయాను.. ఒక ఐదు నిముషాల తరవాత అతనే  " ఎవరు
చెప్పారు విషయం" అని అన్డుగుతూనే ..అమ్మమ్మ చివరినిముషలో పడిన బాధనంతా
చెప్పాడు. అదంతా వింటుంటే..ఎందుకు మనిషికి ఇన్ని బాధలు పెట్టడు దేవుడు అని
అనిపించింది.   బావ కూడా కొద్ది సేపు లోపలకు వెళ్లి వచ్చాక   ఇక ఇద్దరం ఉదయం 4
గంటలవరకు ఏదో మాట్లాడుకొన్నాం. నేను అక్కడే నిద్రలోకి జారుకున్నా...

ఉదయం 5.30 అవుతుండగా అత్తయ్య నిద్ర లేపింది , పకనున్న టౌన్ కెళ్ళి పాలు ,
అత్యవసర సరకులు తీసుకొని రమ్మని. కొద్ది సేపట్లో బంధువర్గం అంతా వొచ్చేస్తారు,
ఎంత చావైనా కొంచం 'చాయ్' అయినా తాగాలి కదా..నేను ముఖం కడుక్కొని, ఓ కజిన్ తో
పాటు స్కూటర్ పై టౌన్ బయలుదేరాను. మేము తిరిగి వొచ్చేసరికి ఇల్లంతా  బంధువులతో
నిండిపోయింది. నేను పాలు ఇతర సరకులు అప్పగించి  వాకిట్లోకి వచ్చాను. అంతిమ
యాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవైపు పాడె  కడుతున్నారు, తెల్లని బట్ట , కొత్త
చీర తెప్పించారు.. బావ కొత్తకుండలకోసం వెళ్ళాడు. ఇంతలొ ఎవరో అన్నారు "త్వరగా
కానీయండి .. ఎంత ఉదయం చేస్తే అంత మంచిది.. పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి".
అప్పుడే 8 కావొస్తోంది. ఇంతలొ చాయ్ తయారైంది.. దూరపు బందువులు అందరూ వేడి వేడి
గా చాయ్ ని గొంతు లోకి జార్చారు.
  యువకులం ఓ పది మందిమి.. దగ్గరలోని బోర్ బావి  దగ్గరికి వెళ్ళాము. అమాంతంగా
నల్లా కింద కూర్చొని మడి స్నానం చేసాము. ఎర్రని పంచెలు కట్టి, రెండు బిందెల
నీళ్ళతో ఇంటికొచ్చాము. మేము వొస్తుంటే అందరూ దూరంగా జరిగి మాకు దారి ఇచ్చారు.
వాకిట్లో కుర్చీ వేసారు.. దాని వయసు అమ్మమ కంటే ఎక్కువే అనుకుంటా.. అమ్మమ్మని ఆ
కుర్చీలో కూర్చుండబెట్టాం. నారాయణ మంత్రం ఉచ్చరిస్తూ స్నానం చేయించారు . మేము
పట్టు పంచలతో కుర్చీ చుట్టూ పట్టుకుంటే ..కొత్త చీర కట్టించారు..ముఖాన
గోపిచందనం పెట్టి నోట్లో తీర్థం, తులసి దళం వేసారు. మెల్లిగా అమ్మమ్మని పాడే
మీద పడుకోబెట్టాము.. తాళ్ళతో గట్టిగా కట్టి.. చుట్టూ 8 చోట్లలో నీళ్లు చల్లి .
బియ్యము, నువ్వులు ఉంచాము. ఏడుపులు ఎక్కువయ్యాయి. మా అమ్మని ఆపడం ఎవరితరము
కావటం లేదు. " ఓం నమో నారాయణనాయ .. ..ఓం నమో నారాయణనాయ " అంటూ  నారాయణ మంత్రం
నిరాఘాటంగా ఉచ్చరిస్తూ పాడెని  ఎత్తి బయలుదేరాము.
బందువులు.. స్నేహితులు...ఆప్తులు.. ఊరిజనం.. దారిన పోయే దానయ్యలు...అందరూ
చూస్తున్నారు " ఒక మనిషి అంతిమ యాత్ర" 

జీవితం ఒక పండగ...
పనిషి పుట్టిన నాటి నుండి  చనిపోయే వరకు పండగే ..
"పుట్టటం .. బారసాల..పుట్టిన రోజులు..పెద్దమనిషి కావటం/ఉపనయనం... పెళ్లి ..
పిల్లలు.....చివరికి 'చావు'కూడా ....అన్నీ పండగలే"
Life is a celebration .

మేము శవాన్ని తీసుకొని ఊరిబయట చెరువు గట్టుకి వెళ్తున్నాము..బందు మిత్ర గణం  ఆమెతో
తమకున్న అనుభంధం ..ఆత్మీయత,. తమ జ్ఞాపకాలు ..ఆమె అనురాగం ..గుణ గణాలు....అన్నీ
ఒకరికొకరు చెప్పుకుంటూ అనుసరిస్తునారు. మూడు చోట్లలో కిందకి దించి మళ్ళీ
నీళ్ళు చల్లి, బియ్యము..నువ్వులు పెట్టారు. చెరువుగట్టుకి పక్కగా ఉన్న పొలం
లో..చితి ఏర్పాటు చేసారు. అమ్మమ్మని చితి పై పడుకోబెట్టాము. అందరూ ఒక్కో కట్టే
ని ఆమెపై ఉంచారు. అక్కడక్కడ  చితి కట్టెలపై కిరోసిన్  చల్లారు. ఇక మిగతా తంతు
జరిగిన తరవాత తల దగ్గర నిప్పు అంటించి తల్లి ఋణం తీర్చుకున్నాడు, మామయ్య .
అప్పటివరకు మౌనంగా గుండె నిండా బాధ నిపుకున్న మావయ్య నిప్పంటించగానే ఒక్కసారిగా
అమ్మా.. అమ్మా అంటూ  బావురుమన్నాడు.

ఒక తల్లి.. ఒక జీవితం..ఒక జ్ఞాపకం ..ముగిసిపోయింది.. ఎవరాపగలరు అతన్ని..ఏమని ఆపగలరు???
అది చూసి ఏడుపులు మిన్ను ముట్టాయి... ఆ ప్రదేశం అంతా శోకరాగాలే...

 నా మనసులోకి ఆలోచనలు నిండాయి.
 కాలిపోతోంది.. .80 ఏళ్ల జీవితం.... మండిపోతోంది చితిలో..
ఎన్ని కలలు కందో..ఎన్ని తీరాయో..ఎన్ని మిగిలాయో..ఎంత ఆనందం పొందిందో..ఎంత
దుఖాన్ని దిగమింగిందో..??
కూతుర్లు ..కొడుకులు..కోడళ్ళు..మనవలు..మనవరాళ్ళు...ఇంత మందికి ప్రేమని అందించిన
మాతృ మూర్తి..
...జీవచ్చవంలా, నరక యాతన అనుభవించి....కాలిపోతోంది అమ్మమ్మ ..

ఒక్కసారిగా గుండె లోతుల్లోని తడి ఎగిసింది.
రెండు కన్నీటి బొట్లు నేల రాలాయి .


Aug 9, 2008

ANVESHANA

సాయంత్రం! ఉదయం రాత్రి గా మారే సమయం..పక్షులు తిరిగి తిరిగి అలసి గూటికి చేరే సమయం...ప్రతివాడు పని ముగించి ఎపుడెపుడు ఇల్లు చేరుకుందామా అని వడి వడి గా వెళ్ళే సమయం. ఆ సమయం లో నాకు ఏ ఒక్కరి మొహంలోను సంతోషం కనిపించదు. ఇక నా సంగతి అయితే మరీను ..నన్ను సాయంత్రాలు పెట్టె బాధ ఆ నరకం లో కూడా ఉండదేమో.. అసలు నరకమంటే సాయంత్రమేనేమో.. మసక చీకటి తో పాటే బాధ కూడా మెల్లగా ముసురుకొని చిక్కనై అశాంతి తో అటు ఇటు పొర్లుతూ నిద్రలోకి జారి కనుమరుగవుతుంది... మళ్లీ సాయంత్రం వరకి హయిగా గడిచిపోతుంది .. అసలు ఇది ఎలా మొదలైందంటే..
అప్పుడు నేను పదవ తరగతి చదువుతుండే వాడిని. రోజు పొద్దున్నే స్కూల్ కి వెళ్ళడం , సాయంత్రం చీకటి పడేవరకు ఏవేవో ఆటలు. తరవాత home work, తిండి, నిద్ర ఇలా గడిచిపోయేది.. అప్పట్లో తెలియదు ముందుది ముసళ్ళ పండగ అని..
మా ఇళ్ళన్నీ ఊరికి కొంత దూరంగా ఉండటం మూలాన రాత్రి దొంగల భయం ఎక్కువగా ఉండేది. వైశాలి వాళ్ళ ఇల్లు చాల పెద్దది కావటంతో దాన్ని మూడు నాలుగు పోర్షన్లు గా విడగొట్టి ఫామిలీస్ కి అద్దెకిచ్చారు . ప్రతి ఇంట్లోను ఇద్దరు ముగ్గురు పిల్లలు. సాయంత్రమైందంటే చాలు ఓ యాభై మంది పిల్లలం పెద్దగా గోల చేస్తూ ఏవేవో ఆటలు. ఆటల్లో మునిగి తేలేది జీవితం . కొంత కాలం క్రికెట్ ,కొంతకాలం కేరమ్స్, చెస్, గోలీలు, గిల్లి దండా ..తరవాత చక్కగా తయారై T.V ముందు హాజరు ఇలా ఉండేది వ్యవహారం .
పదవ తరగతి చివర్లో మొదలైంది ఈ బాధ , తెలియని వెలితి. సాయంత్రాలు ఆట మానేసి ఆకాశం కేసి చూస్తూ ఏదో ఆలోచించటం, రాతి నిద్ర పట్టక పోవటం.. అప్పటికింకా తెలీదు అది యవ్వనం తాలూకు చిహ్నం అని. రోజు పొట్టి లంగాలతో చెంగు చెంగున గెంతుతూ ఆడుకునే అమ్మాయిలు అకస్మాత్తుగా పెద్దాళ్ళలాగ ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఎక్కడ భయం బెరుకు మొదలయ్యాయి వాళ్లతో మాట్లాడాలంటే..ఆటలన్నీ మానేసి ఎప్పుడు అమ్మ వెంటే ఉండేవారు. మేమేమో లాగులు ఎగదోప్పుకుంటూ గిల్లి దండా గోలీలు ఆడుకునే వాళ్ళం, ఎన్నిసార్లు మమల్ని గేలి చేసినట్టు నవ్వినా మాకేమి అర్థం అయ్యేది కాదు.
ఎందుకో మా ప్రపంచం కూడా ఒక్కసారిగా మారిపోయింది. మా ఫ్రెండ్స్ అందరు పెద్దాళ్ళలాగ ప్రవర్తించటం మొదలు పెట్టారు. ఆటలన్నీ మానేశారు , కొంత మంది పొడుగు లాగులు కుట్టించుకున్నారు .ఏడ్చి గీ పెట్టి నేను కూడా pants కుట్టించుకున్నా. అసలా దుమ్ములో ఎలా ఆడాం అని అనిపించింది తరవాత. సాయంతం శుభ్రంగా తయారై చేతిలో ఒక పుస్తకంతో ఏదో చదివి నట్టు pose ఇవ్వటం మొదలెట్టాం అందరం. మాట్లాడే తప్పుడు సినిమాలు వీటి గురించి కాక సబ్జెక్టు, ఫిలాసఫీ రాజకీయాలు ఇలా పెద్ద విషయాలు చర్చల్లోకి వచ్చేవి . అమ్మాయిలు కూడా తెల్లగా ముఖాలు కడుక్కొని దేవుని దీపాలు వెలిగించటం, పేరంటాలు , పెద్దాళ్ళ మధ్య కూర్చొని మాట్లాడటం చేస్తుందే వారు .
వైశాలి కంటికే కనిపించడం మానేసింది, ఒకవేళ ఎదురు పడితే కొత్తగా చూసుకోవటం , మాట్లాడటానికి సిగ్గు పడటం, లేక దూరంగా తొలగి పోవటం చేస్తోంది.. అన్నాళ్ళు కలిసి ఆడిన అమ్మాయి అలా ఎందుకు చేస్తోందో .. ఆ కొత్త ప్రవర్తనకి అర్థం ఏంటో అని ఆ అమ్మాయి గురించే ఆలోచించే వాడిని. ఇలా ఆలోచన ఎక్కువైనా కొద్ది ఏదో కోల్పోతున్నామనే భావన దాన్ని తిరిగి పొందాలనే పట్టుదల మొదలయ్యాయి..ఎన్ని సార్లు ఎదురుపడినా తప్పించుకొని పోయేది.. ఏదో తప్పు చేస్తున్న భావన ప్రవేశించింది మనసులోకి..
ఓ ఆదివారం తల స్నానం చేసి మేడపై ఎండకి నిల్చున్నాను. దూరంగా అ అమ్మాయి కనపడింది ఎక్కడికేల్తుందో అని చూస్తూ ఉండగా .. ఆశ్యర్యం .. మా ఇంట్లోకే ప్రవేశించింది, చేతిలో చిన్న బుట్టతో
"అత్తా అమ్మ పూలు తీసుకురమ్మంది " అంది మా అమ్మతో
"అలాగే మాకు కొన్ని ఇచ్చి వెళ్ళమ్మా " అంది అమ్మ
మాది చిన్న ఇల్లు ఖాలీ స్థలం ఎక్కువ , ఆ స్థలం లో పూల మొక్కలు వేశాం.
నీలి డిసెంబర్ పూలు నవ్వుతున్నాయి, చేమంతులు తలలూపుతున్నాయి, కనకాంబరాలు విచ్చుకోనేలేదు,నేనేమో ఆమె కంట పడాలని ప్రయత్నం మొదలెట్టా. తమని గమనిస్తున్నామని ఆడాళ్ళకి ఎలా తెలుస్తుందో.. నేను చూస్తున్నానని వైశాలికి తెలుసు, కానీ నావైపు చూడదు, కళ్ళు కలపాలని నా ప్రయత్నం.పూలన్నీ కోసి ఇంట్లోకి వెళ్లి మా అమ్మకి కొన్ని పూలు ఇచ్చి వెళ్ళిపోతూ నా వైపు ఒక చూపు విదిల్చింది,ఆ చూపు నా గుండెలో దూరి గిలిగింతలు పెట్టి నాకిదివరకెన్నడూ పరిచయం లేని సంతోషాన్ని కలిగించింది. అది మొదలు నేనా చూపుకై ఆమె చుట్టూ తిరగటం.. సాయంత్రం బడి నుండి వస్తూ ఈ చింత చెట్టు క్రిందో ..పేరంటాళ్ళ కాళ్ళకి పసుపు రాస్తూనో .. ఉయ్యాల బల్ల ఊగుతూనో..వాళ్ళింటి నుండి మా అమ్మని తీసుకొస్తుంటే బొట్టు పేడుతునో..అందరు T.V చూస్తుంటే తను మాత్రం నావైపు ఒక్కసారి.... చూసేది ...నాకు మళ్లీ తెలీని సంతోషం .. అదేం చిత్రమో ఆ సంతోషం క్షణం లో మాయం, మళ్లీ ఆ చూపుకై వెతుకులాట.. ఎలాగు 1st class లో pass అవతామని చదువుపై ధ్యాస నిలుపలేదు.రోజులన్నీ ఆ చూపుకోసం తపించటం తప్ప.. పరిక్షలు ముగుసి results వచ్చాయి. అనుకున్నట్టుగానే నాకు 1st class వచ్చింది.
ఒద్దు మొర్రో అన్న వినకుండా వేరే ఊరిలో ప్రైవేట్ కాలేజీ లో join చేసాడు మా నాన్న.ఉదయం 8 గంటల కల్లా వెళ్ళటం, సాయంత్రం ఏ 6 గంటలకో అలసి పోయి రావటం, దీనికీ తోడూ తట్టెడు home work ..ఇక వైశాలిని చూడటానికి వీలులేకపోయింది. నా ఆరాటం ఎలాగైనా తెలియ జెప్పాలని ఒక రోజు చింత చెట్టు కింద గోడపై ఇద్దరి పేర్లు రాసాను.ఆ అమ్మాయి చూసిందో లేదో కాని వాళ్ళ అన్నయ్య కంట్లో మాత్రం పడింది. ఓ సాయంత్రం నన్ను మా అన్నయ్యని పిలుచుకు పోయారు ఆ చెట్టు క్రిందకి, ఇది మీ వాడు చేస్తున్న నిర్వాకం అని. వాళ్ళలోఒకడు ఆవేశం తో ఉగిపోతూ నా చెంప చెళ్ళు మనిపించాడు. మా అన్నయ్య అడ్డుపడి ఇక మళ్లీ ఇలాంటిది జరగదని హామీ ఇచ్చాడు. నాకు ఇంటికి ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలో తెలిలేదు. మెల్లగా అన్నయ్య వెనకాల నడిచాను. ఇంట్లో కి వెళ్ళాలంటే ఏదో భయంగా సిగ్గు గా ఉంది, అన్నయ్య అమ్మకి నాన్నకి విషయం చెప్పాడు. మా అమ్మ బయటికి వచ్చినా వైపు అదోలా చూసింది , ఎందుకో తెలిదు నా కళ్ళనుండి బొట బొటా కన్నీళ్ళు రాలాయి. ఆ రోజు నుండి నేను మళ్లీ ఆ అమ్మాయి ఇంటి చాయలకి వెళ్ళలేదు.

నా మనసులోని ఆ సంతోషపు పొరలని తట్టే ఆ చూపుకై ఇంకా సాగుతూనే ఉంది నా అన్వేషణ.

Jun 26, 2008

MMTS heros

గుట్కా వేసుకొని .. పదవతరగతి కూడా పాస్ కాని, నిండా 20 ఏళ్ల వయసు లేని కుర్రాళ్ళు ..
మెకానిక్ ,షాపుల్లో చెప్పుల దుకాణాల్లో నెలకి ముడువేలకంటే ఎక్కువ సంపాదించలేని వెధవలు.. hightech city lo పని చేసే అమ్మాయిలకి లైను వేయటం ..తమను చూస్తారని ..సినిమాల్లో చూపించినట్టు తమ స్టైల్ కి పడిపోతారని భ్రమించడం. జాతరలలో దొరికే ఫోన్లలో మాటలు.. ఓ యారో.. ఏ యారో అంటూ pose కొట్టటం ..సీట్లు ఉన్నా కూర్చోకుండా డోర్ దగ్గర గుంపుగా నిలపడటం మిగతావాళ్ళకి అసౌకర్యంగా .. ఆగకముందే దూకి.. ఆగి వెల్లిపోతోంటే దానితో పాటు కొంత దూరం పరిగెడుతూ ఎక్కి ఏదో ఘనకార్యం సాధించినట్టు heroism ప్రదర్శించడం...
...ఒరేయ్ ఒక్కసారి మిమ్మల్ని మీరు చుసుకొండిరా.. మానసికంగా ఎంత అధమంగా ఉన్నారో... ఈ దేశ దరిద్రం అంతా మే నుంచే ..మీ దగ్గరే ఉంది. ఈ ప్రపంచం మిమ్మల్ని వేలివేయక ముందే కుళ్ళుని కడిగేసుకోండి.. మౌడ్యాన్ని వీడండి మంచిగా మనిషిలా బ్రతకండి.
(MMTS trains లో కుర్రాళ్ళని చూసి )